ఆ పేర్లను మారుస్తున్నాం

గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌ పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లను మారుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జగన్ పేరు మీద పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో నూతన పథకాల పేర్లు ప్రకటిస్తున్నామన్నారు. జగనన్న అమ్మఒడి పథకం పేరును.. తల్లికి వందనంగా మార్చామని, జగనన్న విద్యాకానుక పేరు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’గా జగనన్న గోరు ముద్ద పేరు ‘ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా, మన బడి నాడు-నేడు పేరును ‘ మనబడి- మన భవిష్యత్తు’గా మార్చామని చెప్పారు. స్వేచ్ఛ పథకం పేరును ‘బాలికా రక్ష’గా.. జగనన్న ఆణిముత్యాలు పేరును ‘అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చినట్లు తెలిపారు. అందుకు సంబంధించి ట్విట్టర్ లో నారా లోకేష్ పోస్టు పెట్టారు.

"అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ఇందులో భాగంగా తొలుత గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటుచేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నాం. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాము. ఈరోజు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలామ్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్పూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటిస్తున్నాను." అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.


Eha Tv

Eha Tv

Next Story