రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం జరుగుతుందని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు

రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం జరుగుతుందని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర సచివాలయం, 4వ బ్లాక్ లోని ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. సెబ్ పేరుతో వ్యవస్థను విధ్వంసం చేశారు. 70 శాతం ఉద్యోగులను వారి అక్రమ మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా చేశారు. వారి సొంత బ్రాండులైన జె బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత దశల వారీగా మద్యం నియంత్రణ అంటూ మోసం చేశారు. సామాన్యుడు అప్పులు తెచ్చి, పుస్తులు అమ్మి మందు తాగే దుస్థితి తీసుకొచ్చారు. దీంతో మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వారి జేబుల్లోకి వెళ్లిపోయింది. డిప్యుటేషన్ మీద అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. వారి విధానంతో మల్టీ నేషనల్ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. నాసిరకం మద్యం తాగి చాలామంది అనారోగ్యంపాలై మృత్యువాత పడ్డారు. కిడ్నీ సమస్యలు, పెరాలసిస్ వంటి సమస్యలతో మంచానపడ్డారు. డిస్టలరీస్ వ్యవస్థను కూడా వారి చేతుల్లోకి తీసేసుకున్నారు. గత ఐదేళ్లలో వారి అక్రమ మద్య విధానంపై ఎన్నో పోరాటాలు చేశాం. దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు దారి మళ్లించారు. చాలామంది నాటుసారా, నాట్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ కు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్య విధానంపై సీఎం ఆదేశాలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసి బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేయడం జరిగింది. అప్పట్లో 1994లో అమలు చేసిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దానిని ఆదర్శంగా తీసుకుని 6 రాష్ట్రాల్లో నూతన పాలసీపై అధ్యయనం చేశాం. అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ మద్యం షాపులు, ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నడుపుతున్న మద్యం షాపుల విధానాలను అధ్యయనం చేశారు. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందించేలా ప్రపోజల్స్ ను రేపు కేబినెట్ ముందు ఉంచుతాం. డ్రగ్స్, వంటివాటిని నియంత్రించేలా, మత్తుకు బానిసలైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధులు కేటాయించనున్నారు. 5-6 పరీక్షలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం విక్రయాలను నిలిపివేశాం. గత ప్రభుత్వ పాలసీపై జరుగుతున్న విచారణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదు. గత ప్రభుత్వంలో డిస్టలిరీస్ ను కూడా కబ్జా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10 రిజర్వేషన్లు కల్పించి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుంది. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో క్లోజ్ అవుతుంది. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ అలాగే జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.

రాష్ట్ర పౌర, సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. మాకున్న అవగాహనతో కొత్త మద్యం పాలసీ రూపాకల్పనలో సహకరించాం. దీనికి ముందు మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో సమావేశమై చర్చించడం జరిగింది. రేపు కేబినెట్ ముందు నూతన లిక్కర్ పాలసీ ప్రపోజల్స్ ను పెడతాం. గత ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీతో జేబులు నింపుకోవడానికి ప్రయత్నించింది. విచిత్రంగా ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచుకుంటూ పోయారు. గత ప్రభుత్వంలో మద్యం రేట్ల విషయంలో ఒకేరోజు జీవో నెంబర్ 128, జీవో నెంబర్ 129 పేర్లతో రెండు జీవోలు జారీ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా తీసుకొస్తున్న మద్యం విధానం వల్ల మార్పు కనిపిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జాగ్రత్తగా స్టడీ చేశాం. ఎన్ఫోర్స్మెంటును బలోపేతం చేస్తాం. డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లకు నిధులు కేటాయిస్తాం. నూతన మధ్య విధానంతో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పిన జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. సర్వీస్ ఇండస్ట్రీ, టూరిజం డిపార్ట్మెంట్ను బలోపేతం చేసేలా నూతన పాలసీ. వినియోగదారునికి వెసులబాటు కల్పిస్తూ క్వాలిటీ మద్యం అందించడం జరుగుతుంది. ప్రీమియం అవుట్ లెట్స్ పెట్టడం జరుగుతుంది. టాక్స్ స్ట్రక్చర్ ను సులభతరం చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గత పాలకులు వారి జేబుల్లోకి నింపుకున్నారు. నాసిరకం మందుతో మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. వారి స్వలాభం కోసం వేలాది అక్కచెల్లమ్మల పుస్తెలతాడులు తెంపారు. 2014-2019లో రాష్ట్రంలో 36 వేల కిడ్నీ, కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు నమోదైతే.. 2019-2024లో రాష్ట్రంలో 56 వేలకు పైగా కిడ్నీ, కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వంలో నూతన లిక్కర్ పాలసీతో ఆరోగ్యానికి భద్రత కల్పించాలి. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందించడం జరుగుతుంది. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ పేరుతో రూ.13 వేల కోట్లు అప్పు తెచ్చారు. వారి జేబులను నింపుకోవడం కోసం మందు బాబులు విషయంలో కూడా దోచేశారు. ఈ భారం కూడా ప్రస్తుత ప్రభుత్వం పై పడింది. నాణ్యమైన మద్యం, ప్రజల ఆరోగ్యం, పక్క రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం నకిలీ మద్యం ద్వారా వచ్చే సమస్యలతో 2019లో ఆత్మహత్యలు 100% పెరిగాయి. ఇవి ఆత్మహత్యలు కాదు గత ప్రభుత్వ హత్యలు. ఈ మద్య విధానాన్ని రూపొందించిన గత పాలకులపై చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితులను చక్కదిద్దుతూ దేశంలోని బెస్ట్ పాలసీని ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.

రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), సెర్ప్, ఎన్నారై సాధికారిత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలతో నూతన మద్యం పాలసీపై సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా శాఖల అధికారులు ఇచ్చిన ప్రపోజల్సుతో ఆరు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. ప్రజలు నాణ్యమైన మద్యాన్ని కోరుకుంటున్నారు. సెర్ప్ లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో నాసిరకం మందు విక్రయాల ద్వారా ఎంతోమంది అనారోగ్యం పాలే చనిపోయారు. దీంతో వితంతు, ఒంటరి పెన్షన్లు పెరిగాయి. అందుకే రాష్ట్రంలో బెస్ట్ పాలసీని అమలు చేయబోతున్నాం. మల్టీ నేషనల్ కంపెనీలు కూడా తక్కువ ధరకే మద్యం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story