ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు

గుజరాత్ టైటాన్స్ కు సొంతగడ్డపై ఘోర ఓటమి ఎదురైంది. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘోరంగా ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 20 పరుగులు చేయగా, అభిషేక్ పోరెల్ 15 (7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షాయ్ హోప్ 19 (1 ఫోర్, 2 సిక్సులు), కెప్టెన్ రిషబ్ పంత్ 16 (1 ఫోర్, 1 సిక్స్) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టాన్ స్టబ్స్ 2, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. రషీద్ ఖాన్ చేసిన 31 పరుగులే గుజరాత్ ఇన్నింగ్స్ లో అత్యధికం. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఇదే అత్యల్ప స్కోరు. సాయి సుదర్శన్ 12, రాహుల్ తెవాటియా 10 పరుగులు చేశారు. సాహా (2), కెప్టెన్ గిల్ (8), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8), షారుఖ్ ఖాన్ (0) విఫలమయ్యారు.

Updated On 17 April 2024 8:55 PM GMT
Yagnik

Yagnik

Next Story