Deputy CM Pawan Kalyan : వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలి
వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ అయిదేళ్లలో రాదు. ఫిక్స్ అయిపోండి.

•నిబంధనల ప్రకారమే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు
•ఫిక్స్ అయిపోండి... ఈ అయిదేళ్లూ వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు
•అన్నీ తెలిసే వైసీపీ నాయకులు సభా సమయం, ప్రజాధనం వృథా చేస్తున్నారు
•వైసీపీ నాయకుడు సభకు వస్తే సమయం ఎంత ఇస్తారనేది తెలుస్తుంది
•గవర్నర్ గారి ప్రసంగ సమయంలో వైసీపీ తీరు విచారకరం
•గవర్నర్ గారి ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ అయిదేళ్లలో రాదు. ఫిక్స్ అయిపోండి. అది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారో, నేనో కావాలని చేసింది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం, మన రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు. దీన్ని ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావల్సినన్ని సీట్లను వైసీపీ గెలవలేకపోయింది. ఆ విషయం తెలిసినా కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాసనసభా సమయం వృథా చేస్తున్నారు. సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలుంటాయి.. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు. ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించారు.. అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటారని, ఇక్కడ సీట్లు ప్రాతిపదికగా ఉంటుందని వైసీపీవాళ్లు గ్రహించాలన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయిన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేన కంటే ఒక సీటు అధికంగా తెచ్చుకొని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది. కానీ వారికి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. దీన్ని వైసీపీ నాయకులు అర్ధం చేసుకోవాలి. అంతేకాని రాని ప్రతిపక్ష హోదా కోసం విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేయడం తగదు.
గవర్నర్ గారి ప్రసంగం సమయంలో వైసీపీ తీరు బాధాకరం
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా డిమాండు పేరుతో వైసీపీ నేలబారు వ్యూహాలు అమలు చేస్తోంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గత కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోయినా బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఆయన ప్రసంగించేందుకు వచ్చారు. గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిస్థాయిలో వినకుండా వైసీపీ నానా యాగీ చేసింది. ప్రసంగ ప్రతులు చింపేయడం, ప్రసంగం మధ్యలో వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదు. వారు అనుసరిస్తున్న వైఖరి నిజంగా బాధాకరం. గవర్నర్ గారి ప్రసంగంలో ఏముందో తెలుసుకోకుండానే వైసీపీ నాయకులు ఇష్టానుసారం అరుపులు, కేకలు వేయడం వారి తీరును బయటపెడుతోంది.
ముందు అసెంబ్లీకి వస్తే కదా సమయం ఎంత ఇస్తారో తెలుస్తుంది
వైసీపీ నాయకుడు, వారి ప్రజాప్రతినిధులు మొదట అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలి. ప్రజల సమస్యలపై స్పందించాలి. హుందాగా చర్చల్లో పాల్గొనాలి. మొదట వైసీపీ నాయకుడు సభకు వస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో తెలుస్తుంది. అసలు సభకే రాకుండా, రాని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్లు చేయడం అనేది పూర్తిగా అనైతికం. మొదటి సమావేశాల్లోనే వైసీపీ నాయకులకు గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, నేను తగిన గౌరవం ఇచ్చాం. 11 సీట్లే వచ్చాయని వారిని ఎవరూ తక్కువ చేసి చూడలేదు. తగిన మర్యాద ఇస్తున్నాం. అయితే అసెంబ్లీకి రాకుండా మాకు సమయం ఇవ్వరు... మేం మాట్లాడలేం అని మాటలు చెప్పకుండా అసెంబ్లీకి వచ్చి చూస్తే సమయం ఎంత ఇచ్చారు..? మీరు ఎం మాట్లాడారో కూడా ప్రజలకు తెలుస్తుంది.
ప్రోటోకాల్ ను ఎవరైనా పాటించాల్సిందే
ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలను ఎవరైనా పాటించాల్సిందే. ప్రోటోకాల్ మేరకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో మంత్రుల వరుసలోనే కూర్చొన్నాను. అలాగే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో కూడా గవర్నర్ గారిని ఆహ్వానించేందుకు రావాలని తెలిపినా- ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్, ముఖ్యమంత్రి, శాసనమండలి ఛైర్మన్ వెళ్తారు అని నేను వెళ్లలేదు. ఎవరైనా ఆ ప్రొటోకాల్ ను పాటించాల్సిందే. దీన్ని వైసీపీ నాయకులు గమనించాలి. మీకు ప్రజలు ఇచ్చిన సీట్ల సంఖ్య ప్రకారం మాత్రమే హోదా దక్కుతుంది. దాని ప్రకారం అసెంబ్లీలో మాట్లాడేందుకు, ప్రజా సమస్యలు చర్చించేందుకు తగిన సమయం ఇస్తారనేది గుర్తుంచుకోవాలి” అన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జాతీయ మీడియా ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశంపై ప్రశ్నించారు. ‘మార్చి 14వ తేదీ ఆవిర్భావ సభ వేదికగా ఈ అంశంపై వివరంగా మాట్లాడుతాను. వక్ఫ్ బోర్డు ఉంది.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు కావాలి’ అన్నారు. ముఖ్యమంత్రితోనూ, మంత్రివర్గంతోనూ చర్చించి మిర్చి రైతులను ఆదుకునే ఏర్పాటు చేస్తామన్నారు.
