ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కె.శాంతిని(K.shanthi) ప్రభుత్వం టార్గెట్‌ చేసింది.

ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కె.శాంతిని(K.shanthi) ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. తాజాగా ఆమె భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ నోటీసులు(Notice) పంపారు. '2020లో దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె. మదన్‌మోహన్(Madhushudhan) అని సర్వీస్ రిజిస్టర్‌లో శాంతి నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్ అనే తెలిపారు. కానీ జులై 17వ తేదీన నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్(P subash) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు శాంతి చెప్పారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలి' అని నోటీసులో పేర్కొన్నారు. ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీన శాంతిని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ఆమెపై తొమ్మిది అభియోగాలు నమోదు చేసింది. తాజాగా మరో ఆరు అభియోగాలను ఆమెపై మోపింది.

విధులలో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్ అని చెప్పిన శాంతి, వేరొకరిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పడంపై మొదటి అభియోగాన్ని నమోదు చేశారు అధికారులు. దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రెండో అభియోగాన్ని నమోదు చేశారు. కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మూడో అభియోగం నమోదు.

‘ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు సార్ మీరు పార్టీ వెన్నెముకై’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28వ తేదీన ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమంటూ నాలుగో అభియోగం ఆమెపై మోపారు. విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్లోని మరో ఫ్లాట్‌లో నివాసితులతో గొడవపడగా, 2022 ఆగస్టులో అరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఓ అభియోగాన్ని నమోదు చేశారు. శాంతికి అధికారం లేకపోయినా సరే విశాఖపట్నం జిల్లా పరిధిలో వివిధ ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను మూడేళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ మరో అభియోగం. ఇలా ఆమెపై అభియోగాల మీద అభియోగాలు నమోదు చేస్తున్నారు. శాంతి సహాయ కమిషనర్‌గా పని చేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంకా ఏయే ఉల్లంఘనలకు పాల్పడ్డారు? అనేది పరిశీలించడానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నారు. మొత్తంమీద శాంతి జీవితంలో అశాంతి నింపడమే ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story