ఎమ్మెల్యే అరవింద్బాబు ఓవరాక్షన్.. బాబు సీరియస్

ఎమ్మెల్యే అరవింద్బాబు ఓవరాక్షన్.. బాబు సీరియస్
ఎన్నికల ముందు వరకు సైలెంట్గా ఉన్న ఆ నేత.. ఎన్నికల్లో గెలవగానే అధిష్టానానికి షాక్ ఇచ్చేంత వైలెంట్గా తయారయ్యారు. నియోజకవర్గంలో తోటి నేతలతో వైరం పెట్టుకోవడమే కాదు.. అధికారులపైనా వీరంగం ఆడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి నానాయాగీ చేస్తూ నెగిటివ్ ఇమేజ్ పెంచుకుంటున్నారు.. అదేమంటే క్యాడర్ సంక్షేమం కోసమంటూ విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకి పెట్టింది పేరైన పల్నాడు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాల్లో నరసరావుపేట(Narasaraopet) ఒకటి. 2024లో జరిగిన ఎన్నికల్లో చదలవాడ అరవింద్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు కాకుండా బీసీ నేతకు టికెట్ ఇచ్చిన టీడీపీ ఈక్వేషన్ నరసరావుపేటలో వర్కౌట్ అయింది. అయితే.. అరవింద్బాబు ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరిలోనే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల్లోనే అత్యంత వివాదాస్పదుడిగా తయారవుతున్నారు.
అరవింద్బాబు గెలిచిన రోజు నుంచే పార్టీలో ఓ వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ మరో వర్గానికి ప్రాధాన్యం లేకుండా చూస్తున్నారని సొంత పార్టీలోనే పలువురు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం వేలంపాటలో వైన్ షాప్ దక్కించుకున్న టీడీపీ నేతపై అరవింద్బాబు వర్గం దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో చేసిన రచ్చ పెద్ద కలకలమే రేపింది.
దీనిపై స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారంటే అరవింద్బాబు చేసిన రచ్చ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. సైలెంట్గా ఉండే ఆ నేత అంత వైలెంట్గా ఎందుకు మారారనేది ఇప్పుడు నరసరావుపేట వాసులకు అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది.
