CM Chandrababu : సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన..!
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు చేసిన ఈ పర్యటనలో ఓ విశేషమైన సంఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు అక్కడి అంబేద్కర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహాన్ని సందర్శించారు. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం హయాంలో పంపిణీ చేసిన యూనిఫామ్ ధరించిన బాలికలతో బెంచ్ పై కూర్చొని కాసేపు ముచ్చటించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీటిపై వైసీపీ శ్రేణులు స్పందిస్తూ “జగన్ మార్క్ ఇప్పటికైనా కనిపించిందా?” అంటూ విమర్శలు గుప్పించడంతో ఇది రాజకీయ చర్చకు దారి తీసింది. జగన్ అధికారంలోకి రాకముందు వరకు విద్యార్థులకు కనీసం బెంచీలు కూడా లేవని, ఐదేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారని ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్నారు. జగన్ మార్పు తెచ్చిన స్కూళ్లను నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని సూచిస్తున్నారు.
క్వాలిటీ అయిన ఏకరూప దుస్తుల్లో విద్యార్థినులు ఎంత హుందాగా ఉన్నారో చూశారా బాబూ..? మీరెప్పుడైనా విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్స్పై దృష్టిపెట్టిన దాఖలాలు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఫొటోల మీద ఫోకస్ మానేసి జగన్ ఇచ్చినట్లుగా పిల్లలకు అమ్మ ఒడి, సబ్జెక్ట్ టీచర్, ఐబీ సిలబస్, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇవ్వాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో విద్యాశాఖలో మీరు తెచ్చిన మార్పులేంటో చెప్పగలరా అని కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
