BITS Pilani New Campusఏపీ మరో ప్రఖ్యాత విద్యాసంస్థ!
ఏపీ రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది.

ఏపీ రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. దీంతో గత అయిదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు, సంస్థలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రఖ్యాత విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిట్స్ విద్యాలయానికి ఇప్పటికే గోవా, హైదరాబాద్, దుబాయ్లలో క్యాంపస్లు ఉండగా, తాజాగా ఏపీ రాజధానిలోనూ క్యాంపస్ ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. అన్ని హంగులతో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. బిట్స్ ప్రతినిధులు బుధవారం సీఆర్డీఏ అధికారులతో కలిసి కురగల్లులోని ఎస్ఆర్ఎం సమీపంలో, వెంకటాయపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారు. యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బిట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు
