ఆర్కే రోజా(RK Roja) అధికార పార్టీ వైసీపీలో(YCP) ఆమె ఒక ఫైర్ బ్రాండ్‎. ఇప్పటికే వరుసగా రెండుసార్లు విజయకేతనం ఎగరేసిన ఆమె, ప్రస్తుతం మినిస్టర్ హోదాలో హ్యాట్రిక్‎పై కన్నేశారు. ఈసారి రోజాకు టికెట్ కష్టమేనని విపక్షాలు ప్రచారం చేస్తుంటే..స్వపక్షంలోని వ్యతిరేక వర్గం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏది ఏమైనా

ఆర్కే రోజా(RK Roja) అధికార పార్టీ వైసీపీలో(YCP) ఆమె ఒక ఫైర్ బ్రాండ్‎. ఇప్పటికే వరుసగా రెండుసార్లు విజయకేతనం ఎగరేసిన ఆమె, ప్రస్తుతం మినిస్టర్ హోదాలో హ్యాట్రిక్‎పై కన్నేశారు. ఈసారి రోజాకు టికెట్ కష్టమేనని విపక్షాలు ప్రచారం చేస్తుంటే..స్వపక్షంలోని వ్యతిరేక వర్గం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏది ఏమైనా ఈసారి గెలిచేది తానేనని రోజా అంటుంటే..ఓట్లడిగే హక్కు ఆమెకు లేదని టీడీపీ(TDP) అంటోంది. ఈ సారి టీడీపీ(TDP), జనసేన(Janasena) కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ నగరిలో(Nagari) జోరుగా సాగుతోంది. ఇంటా బయటా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న మంత్రి రోజా .. నగరిలో హ్యట్రిక్ కొడతారా? గాలి వారసుడికి అవకాశం ఇస్తారా? ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రిగా రోజా నెరవేర్చారా? నగరి ప్రజల గుండె చప్పుడు ఏమిటి?

తమిళనాడు సరిహద్దులోని చిత్తూరుజిల్లా నగరి నియోజకవర్గంలో(Nagari Constituency) రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‎గానే ఉంటుంది. పొలిటికల్ సర్కిల్‎లో నగరి పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. మంత్రిగా ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైసీపీలో ఫైర్‌బ్రాండ్ నేత మంత్రి ఆర్‌కే రోజా తన వాక్ చాతుర్యం, పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై దాడి చేస్తారు. రాజకీయాల్లో ఐరెన్ లెగ్ అన్న విమర్శలను తిప్పికొట్టి అధికార వైసీపీలో గోల్డెన్ లెగ్‌గా ప్రశంసలు అందుకుంటున్న మంత్రి రోజా హ్యాట్రిక్‎పై కన్నేశారు.
గాలి ముద్దుకృష్ణుమనాయుడు(Gali Mudhukrishna Naidu) వంటి ఉద్దండ నేతను ఓడించడమే కాకుండా వరుసగా రెండుసార్లు గెలిచిన రోజా ఈసారి స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీలోని ఒక వర్గం రోజాకు వ్యతిరేకంగా గట్టిగా పని చేస్తోంది. అంతేకాదు జిల్లాలో ఇద్దరు మంత్రులు కూడా రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నవారిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా అసమ్మతివర్గం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంటా బయటా సవాళ్లను మంత్రి రోజా ఎలా ఎదుర్కొంటారన్నదే అసలు ప్రశ్న.

సరిహద్దులో ఉండే నగరి నియోజకవర్గం తమిళ సంస్కృతి ప్రత్యేకంగా కనిపిస్తుంది. నగరి నియోజకవర్గంలో దాదాపు 30 శాతం ఉన్న మొదలియార్లతోపాటు బలిజలు, ఎస్సీలు ఏ ఎన్నికల్లోనైనా అభ్యర్థుల గెలుపోలములను నిర్ణయించే సామాజికవర్గాలు. ఒకవైపు ఆర్కే రోజా, మరోవైపు టీడీపీ నేత గాలి భానుప్రకాష్‎లు మరోసారి నగరిలో పోటీకి సై అంటున్నారు. 2019 ఎన్నికల్లో తలపడ్డ ఈ ఇద్దరే మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే ఇద్దరి మధ్య నువ్వా..నేనా అన్న పరిస్థితి నగరిలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. నాలుగున్నర ఏళ్లుగా కొనసాగుతున్న ఇదే దూకుడు 2024లోనూ కంటిన్యూ కాబోతుంది. మంత్రిగా ఫుల్ జోష్‎లో ఉన్న రోజా హ్యాట్రిక్ కొడతానన్న నమ్మకంతో ఉన్నారు. 30 ఏళ్లుగా జరగని అభివృద్ధి..ఈ నాలుగున్నరేళ్లలో జరిగిందన్నది రోజా వాదన. జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమంటున్నారు మంత్రి ఆర్కే రోజా. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించిన ఘనత తనదేనంటున్న రోజా అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తానంటున్నారు. ఏ వేదికపైనైనా చర్చకు సై అంటూ సవాల్ విసురుతున్నారు.

చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే నగరి నియోజకవర్గం నుంచి ఎందరో ఉద్దండ నేతలు ప్రాతినిధ్యం వహించారు. రెడ్డివారి చెంగారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి సీనియర్ నేతలు నగరి ఓటర్లు అసెంబ్లీకి పంపించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్‌కే రోజా రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా… సీనియర్ నేత ముద్దుకృష్ణుమనాయుడిని ఓడించి సంచలనం సృష్టించారు. గత ఎన్నికల్లో గాలి తనయుడు గాలి భానుప్రకాశ్‌పై పోటీ చేసి విజయ ఢంకా మోగించారు. అధికార వైసీపీలో సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో రోజా ఒకరు. సీఎం జగన్‌పై ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టే రోజా..రాష్ట్రస్థాయిలో రాజకీయంగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ నేపథ్యం కన్నా మంత్రిగా ఆమెకు రెట్టింపు గుర్తింపు వచ్చింది. దీనికి కారణం.. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్, జనసేనాని పవన్‌పై పదునైన విమర్శలు చేయడంలో రోజా ముందు వరుసలో ఉండటమే.

2009లో నియోజకవర్గాల పునర్విభజన నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాల పేట మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. బీసీలతోపాటు తమిళ మొదలియార్ ఓట్లర్లు ఎక్కువగా ఉన్న నగరిలో తమిళ పార్టీలు అన్నా డీఎంకే, డీఎంకే కూడా పోటీ చేస్తుంటాయి. 1972లో డీఎంకే అభ్యర్థి జ్ఞాన ప్రకాశం రెండో స్థానంలో నిలవడం అంటే తమిళుల ప్రభావం ఎన్నికల్లో ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది. ఇక నియోజకవర్గంలో ఎక్కువ మంది పవర్ లూమ్స్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. వస్త్రాలకు రంగులు అద్దడం ఇక్కడి వారి ప్రధాన వృత్తి. ఐతే రంగులు అద్దడం వల్ల కలుషితమయ్యే జలాలు భూగర్భంలో ఇంకుతుండటంతో తాగునీరు విషతుల్యంగా మారింది. కలుషిత జలాలు తాగడం వల్ల స్థానికుల్లో ఎక్కువ మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. తమిళనాడులో డైయింగ్ యూనిట్లను మూసేయడంతో అక్కడి వ్యాపారులు నగరికి వచ్చి దారాలకు డైయింగ్ వేయిస్తుండటంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. నగరిలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే ఈ సమస్యను అధిగమించొచ్చనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. గాలేరు – నగరి ప్రాజెక్ట్ ద్వారా మంచినీటి సమస్య తీరుతుందని ఆశించినా.. ఆ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి రోజాకు ఈ సమస్యలు కూడా సవాల్‌గా మారుతున్నాయి.

ఇక నగరి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో భూ దందాలు, అవీనితికి అడ్డూ అదుపు లేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి రోజా ఇద్దరు సోదరులపై అనేక భూ దందా ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందా, బియ్యం అక్రమ రవాణాలోనూ మంత్రి సోదరులపై ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. ఐతే మంత్రి విపక్షాలను ఆరోపణలను ఏ మాత్రం లెక్కచేయకుండా తన పని చేసుకుపోతున్నారు మంత్రి రోజా. పైగా తనూ బిజీగా ఉండటం వల్లే సోదరులు నియోజకవర్గ ప్రజల సమస్యలకు అందుబాటులో ఉండటంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఇదేసమయంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత పెరిగిపోవడం రోజాకు మైనస్‌గా మారుతోంది. నగరి వైసీపీలో మూడు నాలుగు వర్గాలు తలనొప్పిగా మారుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో మంత్రి రోజాను గెలిపించిన వారే ఇప్పుడు తిరుగుబాటు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మంత్రికి వ్యతిరేకంగా మండలానికి ఓ నేత తయారు కావడం క్యాడర్‌ను గందరగోళానికి గురిచేస్తోంది.

వడమాల పేట జడ్పీటీసీ సభ్యుడు సురేశ్ రెడ్డి, శ్రీశైలం ఆలయ పాలకమండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి రాజు, పుత్తూరు అమ్ములు, ఈడిగ కార్పొరేషన్ అధ్యక్షులు శాంతి మంత్రికి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి, మరో మంత్రి నారాయణస్వామితో కూడా రోజాకు పొసగడం లేదు. తన వ్యతిరేకులను మంత్రులిద్దరూ ప్రోత్సహిస్తున్నారని రోజా కూడా ఆ ఇద్దరిపై గుర్రుగా ఉన్నారు. పైగా అసమ్మతివర్గంపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా.. పెద్దగా స్పందించినట్టు లేదు. వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజాకి టికెట్ రాకుండా చేస్తామని ఆమె ప్రత్యర్ధి వర్గం సవాల్ చేస్తోంది. ఐతే సీఎం అండదండలు ఉండటంతో రోజాకు ఎట్టిపరిస్థితుల్లోనూ టిక్కెట్ దక్కే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మంత్రి రోజా మాత్రం సీఎం ఆశీస్సులతో మళ్లీ పోటీ చేసి గెలుస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీలో గ్రూప్‌వారే విపక్ష పాత్ర పోషిస్తుండటంతో.. టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాశ్ పని తేలికవుతోందని అంటున్నారు. స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడైన భానుప్రకాశ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతితోపాటు.. తన తండ్రి అనుచర వర్గం ఆశీస్సులు, టీడీపీ ఓటు బ్యాంక్‌తో ఈ సారి నగరిలో టీడీపీ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు భానుప్రకాశ్. ప్రస్తుతం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో బిజీగా ఉన్నారు భానుప్రకాశ్. మంత్రి రోజాపై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందంటున్నారు భానుప్రకాశ్. గత ఎన్నికల్లో కేవలం రెండు వేల ఐదు వందల ఓట్ల తేడాతోనే ఓడిపోయామని.. ఈ సారి గెలుపు పక్కా అన్నధీమాతో ఉన్నారు భానుప్రకాశ్.

నగరి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీలకు పెద్దగా క్యాడర్ లేదు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ జరిగే అవకాశం ఉంది. ఇక టీడీపీ, జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి రోజా అవకాశం చిక్కినప్పుడల్లా.. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలపై వాగ్బాణాలు సంధిస్తుండటం.. ఆయా పార్టీలకు టార్గెట్‌గా మారిపోయారు. గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన టీడీపీ, జనసేన ఈ సారి కలిసి పోటీ చేస్తే ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇటు స్వపక్షం.. అటు విపక్షంతో పోరాడాల్సిన పరిస్థితిలో రోజా అనుసరించే రాజకీయం వ్యూహాంపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. మహిళా మంత్రికి మరో ఛాన్స్ ఇస్తారా? గాలి వారసుడికి మద్దతు లభిస్తుందా? ఆర్కే రోజాపై విపక్షాల చేస్తున్న ఆరోపణలను జనం నమ్ముతారా? నగరి జనం జైకొట్టేదెవరికి? అన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On 30 Aug 2023 2:25 AM GMT
Ehatv

Ehatv

Next Story