ఏపీలో(AP) ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మార్చిలో నోటిఫికేషన్(Notifications) వస్తుందని ఎన్నికల అధికారులు(Election Commission) కూడా ప్రకటించారు. అయితే ఏపీలో ఈ సారి ఎవరికి అధికారం దక్కబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రజలు ఈ సారి ఏ పార్టీ వైపు చూస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి టీడీపీకి(TDP) అధికారం కట్టబెట్టిన ప్రజలు, 2019 ఎన్నికల్లో మాత్రం 151 సీట్లతో వైసీపీకి(YCP) ఘన విజయం అందించారు. ప్రజలు చాలా తెలివైనవారు. ఏ పార్టీ వల్ల తమకు, తమ కుటుంబానికి మేలు జరిగిందో చూస్తారు.

ఏపీలో(AP) ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మార్చిలో నోటిఫికేషన్(Notifications) వస్తుందని ఎన్నికల అధికారులు(Election Commission) కూడా ప్రకటించారు. అయితే ఏపీలో ఈ సారి ఎవరికి అధికారం దక్కబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రజలు ఈ సారి ఏ పార్టీ వైపు చూస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి టీడీపీకి(TDP) అధికారం కట్టబెట్టిన ప్రజలు, 2019 ఎన్నికల్లో మాత్రం 151 సీట్లతో వైసీపీకి(YCP) ఘన విజయం అందించారు. ప్రజలు చాలా తెలివైనవారు. ఏ పార్టీ వల్ల తమకు, తమ కుటుంబానికి మేలు జరిగిందో చూస్తారు. ఎవరి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందో బేరీజు వేసుకుంటారు. శాంతిభద్రతలు కాపాడడం, ఘర్షణ వాతావరణం లేకుండా ఎవరు రాష్ట్రాన్ని ఉంచారో గమనిస్తారు. ఎవరైతే తమ ఆశలకు, ఆకాంక్షలకు తగ్గట్టు పాలిస్తారో వారి వైపే ప్రజలు మొగ్గు చూపుతారన్నది నిజం. సొంత ప్రయోజనాలు, కక్షలు లేని నేతలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉండడం చూస్తాం. తమని ఎవరు పాలిస్తే బాగుంటుందో ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కొందరు ప్రలోభాలకు లొంగినా, అధికశాతం ప్రజలు తమ మదిలో ఎవరికి ఓటు వేయాలో ఫిక్స్‌ అయ్యే ఉంటారు. తమకు లాభం చేయకున్నా నష్టం చేయకుంటే చాలని ప్రజలు అనుకుంటారు.

సాధారణంగా ఏ రాజకీయపార్టీ అయినా అధికారంలోకి రావాలని కోరుకుంటాయి. పార్టీ, నేతల భవిష్యత్‌ అధికారంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజలతో నిత్యం మమేకం కావాలంటే అధికారం ముఖ్యమని భావిస్తుంటుయి. ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ(TDP)-జనసేన(Janasena) జతకట్టాయి. తమ కూటమిలోకి బీజేపీని(BJP) కూడా తీసుకొచ్చేందుకు పవన్‌(Pawan kalyan) విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా తెలంగాణలోనూ బీజేపీతో పవన్‌ జతకట్టారు. మరోవైపు అధికార వైసీపీ..' వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్'(Why AP Needs Jagan) కార్య‌క్ర‌మం చేపట్టింది. ఈ క్రమంలో సామాజిక సాధికార‌త బ‌స్సుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఏపీకి మ‌రోసారి జ‌గ‌న్ ప‌రిపాల‌న ఎందుకు అవ‌స‌ర‌మో వివ‌రించ‌డానికి వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్తోంది. ప్ర‌జాకోర్టులో ఎవ‌రి వాద‌న వారిది. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు

తమ సంక్షేమ పథకాలే మరోసారి తమను అధికారంలోకి తెస్తాయన్న గట్టి నమ్మకంతో వైసీపీ ఉంది. అయితే సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి రావడానికి కొలమనమా అంటే కాదనే చెప్పాలి. గతంలో వైఎస్‌ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. అయినా రెండో సారి ఎన్నికలకు వెళ్లినప్పుడు పాస్‌ మార్కులే వేశారు ప్రజలు. వైఎస్ హ‌యాంలో రైతు రుణ‌మాఫీ, ఉచిత విద్యుత్‌(Free Electricity), ఆరోగ్య‌శ్రీ‌(Arogya Sri), ఫీజురీఎంబ‌ర్స్‌మెంట్(Fee Reimbursement), 108, 104 వాహ‌నాలు త‌దిత‌ర ప‌థ‌కాల్లో ప్రతీ కుటుంబం లబ్ధిపొందింది. రుణ‌మాఫీ, ఉచిత విద్యుత్ వ‌ల్ల ఎన్నో రైతు కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఆరోగ్య‌శ్రీ కింద ఎన్నో వేల కుటుంబాలు ఉచితంగా గుండె ఆప‌రేష‌న్లు, ఇతర జ‌బ్బుల‌కు కార్పొరేట్ వైద్యాన్ని పొంది ప్రాణాలు ద‌క్కించుకున్నాయి. తొలుత 108ను సత్యం రామలింగరాజు ప్రవేశపెట్టినప్పటికీ.. దాని ఫలితాలు బాగుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా 108లను వైఎస్‌ తీసుకొచ్చారు. ఇన్నీ చేసినప్పటికీ 2009లో కాంగ్రెస్‌కు భారీ విజయాన్ని ప్రజలు అందించలేదు. ఇప్పుడు కూడా తాను ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నానని, ఆ పథకాలే తనని గెలిపిస్తాయని జగన్‌ విశ్వాసంతో ఉన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్లు, జగనన్న చేదోడు, ఇళ్ల పట్టాలు వంటివి తమ పార్టీకి ఆయువుపట్టని వైసీపీ అంచనాలు వేస్తోంది. తమ పాలనలో అభివృద్ధికి కూడా పెద్ద పీట వేశామని వైసీపీ చెప్తోంది. రాష్ట్రంలో ముఖ్యమైన 4 పోర్టులను నిర్మిస్తున్నామని, ఈ పోర్టుల ద్వారా భవిష్యత్‌లో రాష్ట్రానికి ఎంతో లాభం చేకూరుతుందనేది వైసీపీ వాదన.

అయితే జగన్‌(Jagan) పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, విపరీతంగా అప్పులు చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడంతో జగన్‌ విఫలమయ్యారని, అభివృద్ధి అనేదే లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని.. చంద్రబాబు(Chandrababu) ఉంటే ఐటీ(IT Sector) రంగం, పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేవాడని మరో వర్గం వాదన. జనసేన గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పలు చోట్ల టీడీపీ ఓటు బ్యాంకును చీల్చిందని.. ఇప్పుడు ఇద్దరూ ఒక్కటై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, దీంతో చంద్రబాబుపై ప్రజలకు సింపతీ(Sympathy) కూడా వచ్చిందని టీడీపీ, జనసేన నేతలు చెప్తున్నారు.

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు తీర్పు అంతిమం. మరో 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని, తమకు ఏ నాయకుడు అవసరమో ప్రజలు ఫిక్స్‌ అయ్యారని, అంతిమంగా ప్రజాభిప్రాయమే ఫైనల్‌ అని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో ఇప్పటికిప్పుడు తెలియకున్నా.. మరికొన్ని రోజులయ్యాకే మూడ్‌ ఆఫ్‌ ఏపీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated On 10 Nov 2023 7:35 AM GMT
Ehatv

Ehatv

Next Story