వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించారు.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించారు. మాజీ మంత్రి ఆర్‌.కె.రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావులను అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈ జాబితాలో ప్రముఖ యాంకర్‌ శ్యామల కూడా చోటు దక్కింది. గ‌త‌ ఎన్నికల్లో శ్యామల పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసింది. తనపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడినా శ్యామల మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పార్టీ కోసం ప‌నిచేశారు. పిఠాపురానికి వెళ్లి జ‌న‌సేన అధినేత‌ పవన్‌ కల్యాణ్‌ను సైతం విమర్శించారు. శ్యామల చేసిన సేవలను గుర్తించిన జగన్‌.. ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా ప్రమోట్‌ చేశారు. దీంతో శ్యామ‌ల ఒక ప్ర‌క‌ట‌న ద్వారా జ‌గ‌న్‌కు ధన్యవాదాలు తెలిపారు.

శ్యామ‌ల ప్ర‌క‌ట‌న‌లో.. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా (spokesperson) నన్ను ఎంపిక చేసినందుకు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

నాపై నమ్మకంతో పార్టీ లో అత్యంత కీలక బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, మరియు మన రాష్ట్ర ప్రజల పట్ల మనం చూపించే సేవా పరమార్ధాలను సమర్ధవంతంగా ప్రజలకు ప్రాచుర్యం చేసే అవకాశాన్ని నాకు అందించినందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.

ఈ పదవి కేవలం ఒక పదవిగానే కాకుండా, ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించి... పార్టీ విలువలకు ప్రతినిధ్యం వహిస్తూ, సత్యనిష్ఠతో, ప్రజలకు, మరియు మీడియాకు సరైన సందేశాన్ని చేరవేయడానికి నా శక్తి మొత్తాన్ని ఉపయోగిస్తాను. ప్రతి కార్యక్రమం, ప్రతి ప్రకటన ద్వారా మా పార్టీ ఆశయాలను, సంకల్పాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేను ప్రతి నిమిషం నిస్వార్ధంగా కృషి చేస్తాను.

ఈ బాధ్యత నాకు అందించినందుకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆశించిన విధంగా ప్రజలకు మంచి సేవలు అందించే ప్రతినిధిగా నా పాత్రను సమర్ధంగా నిర్వహిస్తానని హామీ ఇస్తున్నాను. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నిలిపేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రతి క్షణం నా శక్తి సామర్థ్యాలను వినియోగిస్తాను.

మరొక్కసారి పార్టీ నాపై ఉంచిన విశ్వాసానికి, ఇచ్చిన బాధ్యతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి కొనసాగిస్తానని మాట ఇస్తున్నానని పేర్కొన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story