AP : అచ్యుతాపురం సెజ్ ఘటన.. 14కి చేరిన మృతుల సంఖ్య.. రేపు ఘటనా స్థలానికి చంద్రబాబు
ఏపీలోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.
ఏపీలోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 14 మంది మృతి చెందారు. 33 మంది గాయపడ్డారు. ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్డ్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందలాది మంది పని చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఒకటిన్నర గంటలకు భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో పరిశ్రమలో 300 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
మృతుల వివరాలు
1. సన్యాసి నాయుడు, ప్లాంట్ ఏజీఎం
2. రామి రెడ్డి, ల్యాబ్ హెడ్
3. హారిక, కెమిస్ట్
4. పార్థసారధి, ప్రొడక్షన్ ఆపరేటర్
5. చిన్నారావు, హెల్పర్
6. రాజశేఖర్ 7. మోహన్, ఆపరేటర్
8. గణేష్, ఆపరేటర్
9. హెచ్. ప్రశాంత్
10 ఎం. నారాయణరావు.. మరో నలుగురి వివరాలు తెలియాల్సివుంది.
ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం
సీఎం చంద్రబాబు రేపు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం నిరంతరం సమీక్ష చేశారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను వినియోగించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా.. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.