CM Revanth Reddy : న‌న్ను ఎంత‌గానో అభిమానిస్తారు.. కమ్మవారి లక్షణం అదే..

కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By :  Eha Tv
Update: 2024-07-20 12:56 GMT

కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నఆయ‌న మాట్లాడుతూ.. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారని అన్నారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు. కష్టపడటం... పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం అని కొనియాడారు. కమ్మ సామాజికవర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుందని తెలిపారు.

ఎన్టీఆర్ లైబ్రరీలో మేం చదువుకున్న చదువు.. మమ్మల్ని ఉన్నతస్థానంలో నిలబెట్టిందన్నారు. నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారన్నారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయన్నారు.హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు మీరు భాగస్వాములు కావాలని కోరారు. మీలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. మాకు భేషజాలు లేవు.. మేం కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తాం.. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదు.. అది మా ప్రభుత్వ విధానం కాదన్నారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు. నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయో మీరు చూశారు. జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోందన్నారు. కుల, మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలన్నారు. వివాదంలో ఉన్న 5ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తామ‌న్నారు. భూసమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పదిమందికి సాయం చేసే మీ సహజ గుణాన్ని వీడొద్దని కోరారు.

Tags:    

Similar News