మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగివాల్సి వచ్చింది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగివాల్సి వచ్చింది. ఎప్పుడైతే జగన్‌ గద్దె దిగారో అప్పట్నుంచే ఆ పార్టీకి చెందిన నాయకుడు పక్క చూపులు చూడటం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు జగన్‌కు జై కొట్టిన వారికి హఠాత్తుగా జగన్‌లో ఓ నిరంకుశుడు కనిపించాడు. చెప్పిన మాట వినని పొగరుబోతు దర్శనమిచ్చాడు. నాయకులను పూచికపుల్లలా చూసే అహంకారి కనిపించాడు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ అరాచకాలు కనిపించాయి. జగన్‌ కోటరీపైనే ఎక్కువ నిందలు వేస్తున్నారు. ఇంతకాలం జగన్‌కు బాసటగా నిలిచిన కొన్ని మీడియా సంస్థలు, కొన్ని వెబ్‌సైట్లు కూడా జగన్ ఓటమికి కోటరిలోని వారే కారణమంటూ రాసుకొస్తున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు కోటరీలోని వారు రాజకీయ, పాలన వ్యవహారాలను చూసుకున్నారని, శాసించారని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని అంటున్నాయి. జగన్‌ చుట్టూ చేరిన వందిమాగధులు అధినేత ఆలోచనలను ప్రభావితం చేస్తూ వచ్చారట! జగన్‌ దగ్గరకు వద్దామనుకునేవారిని గడప దగ్గరే ఆపేసి వెళ్లగొట్టారట! జగన్‌ దగ్గర మనుషులమని చెప్పుకుని వేల కోట్ల రూపాయలను సంపాదించారట!

ఇలా జగన్‌ చూట్టూ ఉన్నవారి గురించి ఇప్పుడు రాతలు ఎందుకు రాస్తున్నట్టు? వారిని పార్టీ నుంచి పంపించేయాలనే దురాలోచన ఏమైనా ఉందా? వారు పార్టీ నుంచి వెళ్లిపోతే ఎవరికి లాభం? ఇవన్నీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలు. జగన్‌ చుట్టూ వలయంలా ఏర్పడి, ఆయనను ప్రభావితం చేస్తూ వచ్చిన వారంటూ సజ్జల రామక్రిష్ణారెడ్డి(Sajjala Rama krishna Reddy), విజయసాయిరెడ్డి(Vijay Sai reddy), వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), ధనంజయ రెడ్డి(Dhanujay Reddy), రిషి రాజు(Rishi Raju), కెఎన్ఆర్(KNR), రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy), కృష్ణమోహన్ రెడ్డి(Krishnamohan reddy) పేర్లను కూడా ప్రస్తావించాయి కొన్ని వెబ్‌సైట్లు. ఎందుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని(Peddireddy Ramachandrareddy) వదిలేశాయి. జగన్‌ అనుకూలమని చెప్పుకున్న సోషల్ మీడియా గ్రూపులు వీరిని లక్ష్యంగా చేసుకుని కథనాలు రాస్తున్నాయి. జగన్‌ నుంచి వీరిని దూరం చేయాలన్నదే టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అధికారంలోకి వచ్చే వరకు ప్రజలకు దగ్గరగా ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొంచెం గ్యాప్‌ వచ్చిందన్నది నిజం. అది కోటరి వల్లనే అనడం మాత్రం సరికాదు. వారి జోక్యం క్యాడర్‌కు నచ్చకపోవచ్చుగాక, జగన్‌ను కలవనీయకుండా వీరు అడ్డుపడి ఉండవచ్చుగాక, కానీ జగన్‌ను ప్రభావితం చేశారనడం మాత్రం సరికాదు. ఎందుకంటే జగన్ ఒకరు చెబితే వినే రకం కాదని అందరికీ తెలుసు. తను ఓ నిర్ణయం తీసుకున్నాడంటే దానికి అందరూ కట్టుబడాల్సిందే. ఆయనకు చెప్పే సాహసం ఎవరూ చేయరు. సలహాదారులు పేరుకే తప్ప సలహాలు సూచనలు ఇచ్చేందుకు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే! మరి కోటరి జగన్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇంతకు ముందు తెలుగుదేశంపార్టీలోనూ ఇదే జరిగింది. అప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)లాంటి వాళ్లు తమను లోకేశే తన అనుకూల పత్రికల్లో నెగటివ్‌గా రాయించి బయటకు వెళ్లేలా చేశారని ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP)లో కూడా అదే జరుగుతుందన్న అనుమానం కలుగుతోంది. ఇప్పుడు జగన్‌ పార్టీ లోంచి బయటకు వెళుతున్నవారందరూ ఆల్‌మోస్టాల్‌ ఇదే రీజన్‌ చెబుతున్నారు. ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్‌ చెప్పాల్సింది కేవలం జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మాత్రమే! ఆయన ఎంత తొందరగా ఈ విషయం తెలుసుకుంటే అంత మంచిది!

ehatv

ehatv

Next Story